*వీఆర్ ఏలకు చర్చలకు పిలిచిన మంత్రి కేటీఆర్
*15 మంది వీఆర్ ఏలకు కేటీఆర్ ఆహ్వానం
వీఆర్ఏల ఆందోళనపై ప్రభుత్వం స్పందించింది. వీఆర్ఏ సమస్యలపై చర్చకు సిద్ధమైన సర్కార్ 15 మందితో కూడిన వీఆర్ఏల నేతలను అసెంబ్లీకి ఆహ్వానించారు.
అసెంబ్లీ కమిటీ హాలులో వీఆర్ఏ నేతలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.వీఆర్ఏల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు.
పేస్కేల్ను అమలు, వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలని, 55 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ను వీఆర్ఏ నేతలు కోరారు.
సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు 50రోజులకి పైగా ఆందోళన చేస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరవధిక సమ్మెకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు తరలి వచ్చి అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. భారీర్యాలీ గా అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వీఆర్ఏలను తెలుగు తల్లి వంతెన కింద పోలీసులు అడ్డుకున్నారు.
అసెంబ్లీ వైపు దూసుకెళ్లిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో వీఆర్ఏలను ప్రభుత్వం చర్చలకు పిలిచింది.