టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డీకే అరుణ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయడానికి డీకే అరుణ భయపడుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాగర్కర్నూలులో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
గతంలో పాలమూరు లోక్సభ స్థానానికి కాంగ్రెస్లో విపరీతమైన పోటీ ఉండేదన్నారు. కానీ ఇప్పుడు అభ్యర్థులు కరువయ్యారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నాగర్కర్నూల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాలని, ఎవరైనా కొత్త వారు పార్టీలో చేరితే చేర్చుకోవాలని సూచించారు. దక్షిణాదిలో ఉనికే లేని బీజేపీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. దాదాపు 70 నుంచి 80 పార్లమెంట్ ఫెడరల్ స్ధానాలు సాధిస్తే.. ఢిల్లీ గద్దెపై ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిస్తామన్నారు.