తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా దారుణమైన విషయమని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. హన్మకొండలో ఈరోజు విలేకరులతో ఆమె మాట్లాడుతూ దాదాపు ఇరవై మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే వరకూ ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి స్పందించకపోవడం దారుణమని అన్నారు. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన బిడ్డలను మొగ్గలో తుంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిని సస్పెండ్ చేయాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కేటీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శించారు. గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంస్థపై గతంలో కూడా ఆరోపణలు ఉన్నాయని, ఇలాంటి సంస్థకు ఇంటర్ బోర్డు ఫలితాలను అప్పజెప్పడం వల్ల ఈ దారుణం జరిగిందని మండిపడ్డారు. బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. మూడున్నర లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
.