సర్వజగత్తుకు ఆధారభూతం మహదేవుడు. మహదేవుడే శివుడు. శివుడే మల్లికార్జునుడు. మల్లికార్జునుడే భక్తులకు మల్లన్న. కోరిన కోర్కెలు తీర్చే భక్తజన వరదుడు కొమరవెల్లి మల్లికార్జునుడు. అంతటి మహత్తర దేవుడి బ్రహ్మోత్సవాలంటే మాటలా..! ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాల సందడి సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమరవెల్లిలో మొదలైంది. ఈ నెల 26 వ తేదీన కొమరవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి.
కైలాసవాస..ఈశా..మహదేవా, మల్లికార్జునా..పాహిమాం, పాహిమాం, రక్షమాం, రక్షమాం…భక్తుల ఈ శరణు ఘోషతో, శివనామ స్మరణతో…కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి పుణ్యక్షేత్రం మార్మోగిపోయే రోజు వచ్చేస్తోంది. అసంఖ్యాక భక్తజన సందోహంతో..ఈ పుణ్యక్షేత్రం పులకించపోయే పుణ్యఘడియలు అతి సమీపంలోకి వచ్చేశాయి.
సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సిద్దిపేట అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు సమావేశం అయ్యారు. ఈ నెల 26న స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించడానికి, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. మల్లన్న కల్యాణానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ముత్తిరెడ్డి కోరారు.
మల్లన్న బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు రావడం ఆనవాయితీ. స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలకు వచ్చే భక్తులకు త్రాగునీరు, స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, మెడికల్, పార్కింగ్..ఇలా భక్తులకు కల్పించాల్సి అన్ని సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు మాస్కు తప్పనిసరిగా ధరించాలని, కోవిడ్ వ్యాక్సిన్ రిపోర్ట్ తీసుకురావలని ఆయన తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిని దర్శనానికి అనుమతించకూడదని ఆలయ అధికారులకు స్పష్టం చేశారు.
కాకతీయ, చాళుక్య చక్రవర్తుల నిర్మాణ శైలి, సంస్కృతితో నిర్మితమైన అతి ప్రాచీన దేవాలయం కొమరవెల్లి మల్లన్న ఆలయం. తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటకు 24 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ ఆలయం, సిద్దిపేట, హైదరాబాద్ మార్గంలో నెలకొని వుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని కొలవని భక్తులు లేరంటే అతిశయోక్తి కాదేమో. కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తజన వరదే ఇందుకు ఉదాహరణ.
కొమురవెల్లి మల్లన్న స్వామీని బండ సొరికల వెలసిన దేవునిగా కీర్తిస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది. ఈ దేవుని ఎక్కువగ కురుమలు, గొల్లలు, కాపు కులస్థుుల పూజిస్తారు. గుడి ఎదురుగా గంగిరేణి వృక్షం ఉంది. ఈ ఆలయానికి 15 కి.మీ దూరంలో పోచమ్మ దేవి ఆలయం సైతం ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన వారు ఈ ఆలయాల్లనూ దర్శనం చేసుకుంటారు.
విశిష్ట చరిత్ర ఈ ప్రాచీన ఆలయంపై భక్తులు పలు కథనాలు వినిపిస్తారు. పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చిందని పలువురు విశ్వసిస్తారు. కాలక్రమేణా కుమారవెల్లి గ్రామమే కొమరవెల్లి అయిందని భక్తులు చెబుతున్నారు. వీరశైవమత ఆరాధకులైన మాదిరాజు, మాదమ్మ అనే పుణ్య దంపతులకు సాక్షాత్తు శివుడు.. కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని ఈ క్షేత్ర పురాణం తెలియజేస్తోంది. తన భక్తుల రక్షణార్ధం ఇక్కడ కొలువుదీరిన కైలాసవాసుడు..భక్తులతో ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడుతున్నట్టు ఆలయ చరిత్ర చెబుతోంది.
వాయిస్ : శివునికి సాధారణ ప్రతి రూపమైన లింగ రూపంలోకాక, గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా కొమరవెల్లి మల్లన్న దర్శనమిస్తాడు. దేవేరులు యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజకులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్ళనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం రూపొందించినట్టు తెలుస్తోంది. కాలక్రమేణా భక్తుల రాక అధికం కావడంతో ఆలయ ప్రాంగణంతోపాటు, పరిసరాలు అభివృద్ధి చెందాయి. ఎన్నో నూతన కట్టడాలు, పెద్ద పెద్ద సత్రాలతో ఆలయ పరిసరాలు శోభిల్లుతున్నాయి.