కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి నియోజక వర్గ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి అభివృద్ది పనులకు రూ. 600 కోట్లు మంజూరు అయినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే భువనగిరి లోకసభ నియోజకవర్గంలో ని పలు ప్రాజెక్టులపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణం అంతకంతకు పెరిగిపోతుందని… కాబట్టి మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి 167లో అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణపనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అలాగే ఎన్హెచ్ – 365లో నకిరేకల్ నుంచి తానంచెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయ్యాయని అందులో అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. అంతేకాదు… ఓఆర్ఆర్ గౌరెల్లి నుంచి కొత్తగూడె ఎన్హెచ్ -30 వరకు నూతనంగా మంజూరైన ప్రాజెక్టుకు జాతీయ రహదారి నెంబర్ కేటాయించి డీపీఆర్లను ఆమోదించి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. అయితే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన వినతి పత్రానికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. వెంటనే ఈ నూతన ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వారం తరువాత ఈ ప్రాజెక్టులపై చర్చించడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని రావాలని కేంద్ర మంత్రి గడ్కరీ ఆహ్వానించారు.