టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో రవీంద్రను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చారు. ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం రవీంద్రను రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించారు.
గత నెల 29న మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు మోకా భాస్కరరా వు(57) మచిలీపట్నం చేపలమార్కెట్ వద్ద హత్యకు గురయ్యారు. ఆ హత్యకేసులో ఐదుగురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన సమయంలో కొల్లు రవీంద్ర పేరును చెప్పారు. ఈ హత్యకు సహకారం అందించినట్టు చెప్పారని పోలీసులు తెలిపారు. ఈ కారణంతోనే అరెస్ట్ చేశామన్నారు. ఎఫ్ఐఆర్లో కొల్లు పేరును చేర్చినట్టు మచిలీపట్నం డీఎస్పీ మెహబూబ్ బాషా తెలిపారు.