తాజాగా వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్లో భారత సారథి విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా ఎంపికైన విషయం తెలిసిందే. బుధవారం ముంబయిలో జరిగిన నిర్ణయాత్మక టీ20లో 29 బంతుల్లోనే 70 పరుగులు చేసిన అతడు తొలి మ్యాచ్లో 50 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఎప్పుడూ కళాత్మక బ్యాటింగ్తో ఆకట్టుకునే విరాట్ ఈసారి భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో గురువారం ప్రకటించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ ఐదు స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు సంపాదించుకున్నాడు. కోహ్లీ ఈ సిరీస్కు ముందు పొట్టి ఫార్మాట్లో 15వ స్థానంలో నిలిచాడు.
ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి మ్యాచ్లో 62, మూడో మ్యాచ్లో 91 పరుగులతో రాణించి మూడు స్థానాలు మెరుగు పర్చుకున్నాడు. ఇదివరకు తొమ్మిదో స్థానంలో నిలిచిన అతడు తాజా ర్యాంకింగ్స్లో ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక విధ్వంసక ఓపెనర్ రోహిత్శర్మ తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమై.. ఆఖరి మ్యాచ్లో 34 బంతుల్లో 71 పరుగులతో రాణించినా తాజా ర్యాంకింగ్స్లో ఒక స్థానం పడిపోయాడు. దీంతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కాగా, ఈ జాబితాలో బాబర్ అజామ్, ఆరోన్ ఫించ్, డేవిడ్ మలాన్ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.