ప్రపంచవ్యాప్తంగా టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే అతను ఏం చెప్పినా… అది యూత్లోకి దూసుకెళ్తుంది. అందుకే ఓటు వెయ్యాలని విరాట్ అందరికీ చెప్పాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దానిపై విరాట్ కోహ్లీ సైతం పాజిటివ్గా స్పందించాడు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు. ఇక్కడ వరకూ అంతా బాగానే ఉంది. అయితే… ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం ఈ టీంఇండియా కెప్టెన్ ఓటు వేసే అవకాశాలు కనిపించట్లేదు. ముంబయిలో ఉన్న తన ఇంటి చిరునామాతో కొత్త ఓటర్ ఐడీ కోసం కోహ్లీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటికే ఆఖరు తేదీ ముగిసింది. మార్చి 30న దరఖాస్తుల ఆహ్వానానికి ఆఖరుతేదీగా నిర్ణయించగా కోహ్లీ ఆ తర్వాత దరఖాస్తు చేసుకున్నాడట.
దీని తో ఈ సారి లోక్సభ ఎన్నికల్లో కోహ్లీ ఓటు వేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల సంఘానికి కోహ్లీ దరఖాస్తు అందింది. ఆఖరు తేదీ దాటిన తర్వాత దరఖాస్తు చేరింది, కావున దాన్ని పెండింగ్లో పెట్టామని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఓటరు లిస్టులో పేరును చేర్చాలని కోహ్లీ నుంచి ప్రత్యేక అభ్యర్థన వచ్చిందని.. కానీ, నిబంధనల ప్రకారం ఆఖరు తేదీ దాటిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోమని ఎన్నికల సంఘం అధికారి తెలిపారు.