విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్కి ముందు టీం ఇండియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ ఆసక్తికర అనుభవం ఎదురైంది. విరాట్ కోహ్లీని తన వీరాభిమాని ఇక్కడ కలుసుకున్నాడు. తన ఆటతీరుతో విరాట్ కోహ్లీ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. క్రికెటర్గా మాత్రమే కాదు.. సామాజిక సేవలో కూడా పాల్గొనే విరాట్ని ఎంతో మంది అభిమానిస్తారు. విరాట్ను కలిసిన అభిమానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. విరాట్ ఫొటో, అతని పేరు, జెర్సీ నెంబర్ ఇలా విరాట్కు సంబంధించిన ప్రతీ ఒక్క విషయాన్ని అతను తన వంటిపై పచ్చబొట్టు(టాటూ) వేసుకున్నాడు.
ఇది చూసిన విరాట్ ఆనందంతో పొంగిపోయాడు. సదరు అభిమానికి దగ్గరకు తీసుకొని వాటేసుకున్నాడు. అతనితో కలిసి ఫొటో దిగాడు. ప్రస్తుతం సోషల్మీడియాలో ఎక్కడ చూసిన ఈ ఫొటోలే కనిపిస్తున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వర్షం కారణంగా త్వరగా ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్లు మంచి ఆరంభాన్ని అందించారు. రోహిత్ శర్మ సెంచరీ సాధించగా.. మయాంక్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. మ్యాచ్ ముగిసేసమయానికి టీం ఇండియా 59.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 202 పరుగులు చేసింది. క్రీజ్లో రోహిత్(115), మయాంక్(84) ఉన్నారు.