తెలంగాణాలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా విలీన ప్రతిపాదన తేవటంపై ఆ పార్టీ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.. ఈ దీక్షకు నేడు టీజేఎస్ అధినేత కోదండరాం మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క శనివారం నుంచి ధర్నా చౌక్ దగ్గర 36 గంటల పాటు నిరసన దీక్ష దిగారు. కాంగ్రెస్ దీక్షకు కోదండరాం మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పార్టీల వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో లేనివారు విలీనం చేయాలని ఎలా సమావేశం పెడతారని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను కలవడానికి స్పీకర్ ఎందుకు సమయం ఇవ్వడంలేదని నిలదీశారు. సీఎల్పీ విలీనాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోదండరాం పిలుపునిచ్చారు.