ఐపీఎల్ 2021 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ టిమ్ సీఫెర్ట్.. స్వదేశానికి పయనమయ్యే ముందు కరోనా బారిన పడ్డాడు. కరోనాతో ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడటంతో తన దేశస్థులతో కలిసి స్వదేశం వెళ్లేందుకు సిఫెర్ట్ సిద్ధమయ్యాడు. మరుసటి రోజు విమానం ఎక్కుతామనగా అతనికి పాజిటివ్ వచ్చింది. దీంతో చెన్నైలో క్వారంటైన్ అయ్యాడు. కోలుకున్నాక న్యూజిలాండ్ వెళ్లాడు. తన అనుభవాన్ని వివరిస్తూ కన్నీరు కార్చాడు. ‘కరోనా టెస్ట్లో పాజిటివ్ వచ్చిందని చెన్నై సూపర్కింగ్స్ మేనేజర్ చూపించాడు. దాంతో ప్రపంచం ఆగిపోయినట్టు అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బాగా భయమేసింది. భారత్లో బాధితుల గురించి మీరు వినే ఉంటారు. నాకూ అలాగే జరుగుతుందా? అని ఆందోళన చెందాను. ఆక్సీజన్ కొరత వార్తలే వినిపించేవి. అలాంటి పరిస్థితులు ఎదురవుతాయో లేదో తెలియదు. అసలు కొవిడ్ గురించే ఇంకా పూర్తిగా తెలియదు’ అని సీఫెర్ట్ అన్నాడు. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ తనకు కాస్త ఉపశమనం కలిగించారని టిమ్ తెలిపాడు. ‘వారు నాకు భరోసా కల్పించారు. అన్నీ సవ్యంగా ఉండేట్టు చూసుకున్నారు. సీఎస్కే, కేకేఆర్ యాజమాన్యాలూ పరిస్థితిని పర్యవేక్షించాయి. ఇంటికి క్షేమంగా తిరిగివెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఏదేమైనా పాజిటివ్గా ఉండాలని అర్థమైంది. అనుకున్న సమయం కన్నా ముందుగానే రావడంతో నా కాబోయే భార్య సంతోషించింది’ అని సీఫెర్ట్ చెప్పుకొచ్చాడు. టీమ్ సిఫెర్ట్ ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
previous post
next post