తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 నుంచి 293 జిన్నింగ్ & స్పిన్నింగ్ మిల్లులు ప్రారంభం కానున్నాయని, పత్తి రైతుల సహాయార్థం అన్ని ప్రాంతాలలో పత్తి సేకరణ కేంద్రాలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తాయని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం కవాడిగూడ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయంలో.. సిసిఐ, నాఫెడ్, ఎఫ్సిఐ, తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం, పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్ జనరల్ శ్రీ వేంకటేశ్వర్ తో కలిసి కేంద్ర మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. పత్తి సేకరణ విషయంలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించే అధికారులపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సిసిఐ, డిజిఎమ్, అమర్నాథ్ రెడ్డిని కేంద్ర మంత్రి ఆదేశించారు. రైతులకు పూర్తి లాభసాటి ధర లభించేటట్లు పత్తి సేకరణ ఉండాలని, దళారుల, ప్రైవేటు వ్యాపారస్తులను అనుమతించరాదని మంత్రి స్పష్టం చేశారు.
రైతులు మార్కెట్ కు తీసుకువచ్చే పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండేటట్లు రైతులకు కరపత్రాల ద్వారా సిసిఐ అవగాహన కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి అన్నారు. ఆధార్ ఆధారిత నగదు బదిలీని పత్తి సేకరణలో ఉపయోగిస్తున్నామని, పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రతి సేకరణ కేంద్రంలో తేమ శాతాన్ని కొలిచే యంత్రాన్ని అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. తద్వారా ఎటువంటి జాప్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం పత్తి దిగుబడి తగ్గే అవకాశం ఉన్నప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలతో రైతులకు పూర్తి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. తొందరపడి తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారస్తులకు పత్తిని అమ్మవద్దని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా రైతులని కోరారు.
ఏపీలో వైసీపీ గెలిస్తే కేసీఆర్ గెలిచినట్టే: పవన్ కల్యాణ్