గత ప్రభుత్వాలు ఎంత వేధించినా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాత్రం ఉద్యమబాట వీడలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరిగిన ఎమ్మార్పీఎస్ 25వ వార్షికోత్సవ సభకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ సాగిస్తున్న అలుపెరుగని పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.
పాతికేళ్ల క్రితం ఈదుమూడిలోనే ఎమ్మార్పీఎస్ ఉద్యమం మొదలైందని, తాను కేంద్రమంత్రినైనా ఎప్పటికీ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు సోదరుడ్నేనని చెప్పారు. ఈదుమూడిలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఎమ్మార్పీఎస్ ను బలహీనపర్చేందుకు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని కాలరాసేందుకు పాలకులు ఎన్నో కుతంత్రాలకు పాల్పడినా మంద కృష్ణ మాత్రం పోరాటపంథాను వీడలేదని అన్నారు.