తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణానికి కారణాలను కిమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ భాస్కర్ రావు వెల్లడించారు.
క్యాన్సర్, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్లతో వైద్యచికిత్సకు శరీరం సహకరించకపోవడంతో శ్వాస పీల్చుకోవడం కష్టమైంది తెలిపారు.
ఆరేళ్ల క్రితం క్యాన్సర్తో సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగిందని తెలిపారు. వారం క్రితం మరో వైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్ వస్తే దాంట్లో కూడా సగం తీసేశామని వెల్లడించారు. ఆ తర్వాత రెండ్రోజులు బాగానే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం కిమ్స్కు తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కిమ్స్లో రెండ్రోజులు వైద్యం అందిస్తే బాగానే రికవరీ అయ్యారు. ప్రికాస్టమీ కూడా చేశామని వివరించారు. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం కాబట్టీ.. మిగిలిన 55 శాతం లంగ్కు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. ఆక్సినేషన్ సరిగా లేక ఎక్మో మిషన్పై పెట్టి శ్వాసను పునరుద్ధరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వివరించారు.
గత ఐదు రోజుల నుంచి ఎక్మో మిషన్పైనే ఉన్నా శ్వాస తీసుకోవడంలో పురోగతి కన్పించలేదన్నారు. ఎక్మో మిషన్పై ఉన్న తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ అవడంతో ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకిందనీ, చికిత్సకు శరీరం సహకరించడం తనువుచాలించారని వివరించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సిరివెన్నెల తుదిశ్వాస విడిచారని కిమ్స్ ఆసుపత్రి ఎండీ భాస్కరరావు వెల్లడించారు.