సీఏఏ అనుకూల, వ్యతిరేక నిరసనల నేపథ్యంలో నిన్న ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు శాంతిని పాటించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఇవాళ అత్యవసర సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
సీఏఏని వ్యతిరేకిస్తూ నగరంలో జరుగుతున్న అల్లర్ల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో అనేక మంది పోలీసులు, పౌరులు కూడా గాయపడ్డారు. ఇది దురదృష్టకరమన్నారు. మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీకానున్నట్లు సీఎం చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో పోలీసుల సంఖ్యాబలం తక్కువగా ఉన్నట్లు కేజ్రీ తెలిపారు. గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించాలంటూ వైద్యాధికారులకు ఆదేశించామని సీఎం తెలిపారు.