కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తెలంగాణ ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు కరీంనగర్ లో పర్యటించనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలను కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్వచ్చిన కొద్దిమందికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో అధికార యంత్రాంగం పట్టణంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది.
‘కరోనా’ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితి గురించి కేసీఆర్ తెలుసుకుంటున్నారు. సీఎంతో పాటు రాష్ట్రస్ధాయి ఉన్నతాధికారులు కూడా కరీంనగర్లో పర్యటిస్తారు. అక్కడే ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు.