కరోనా వైరస్ విస్తరించకుండా అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఒకవేళ కరోనా విజృంభించే పరిస్థితి వస్తే మాత్రం పూర్తిగా షట్ డౌన్ చేయడానికి కూడా వెనుకాడబోమని చెప్పారు.
ప్రతి ఒక్కరినీ వారి ఇళ్లకే పరిమితం చేస్తామని తెలిపారు. ప్రభుత్వమే వారికి అవసరమైన నిత్యావసరాలను అందించేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదనే తాను కోరుకుంటున్నానని చెప్పారు.
రెండు, మూడు రోజుల్లో మహారాష్ట్ర సరిహద్దులను మూసేస్తామని తెలిపారు. కరోనాను కట్టడి చేసేందుకు రూ. 10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమేనని అన్నారు.
కరోనా వైరస్ కు ఆత్మాభిమానం చాలా ఎక్కువని కేసీఆర్ చమత్కరించారు. దానంతట అది మన ఇంటికి రాదని… దాని దగ్గరకు మనం వెళ్లి, పిలిస్తేనే అది మనింటికి వస్తుందని చెప్పారు. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.