సమాఖ్య కూటమిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ దృష్టి సారించారు. త్వరలో రాష్ట్రాలలో పర్యటించి, వివిధ పార్టీల నేతలను కలిసి కూటమి ఏర్పాట్లపై చర్చించాలని భావిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కార్యాచరణ ఖరారు కానున్నట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పలువురు ముఖ్యమంత్రులు, నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటు ఎన్నికల నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు.
మళ్లీ కూటమి కార్యకలాపాలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఎన్నికలు పూర్తయిన రాష్ట్రాలలో ఆయన పర్యటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లోని పార్టీల నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మే 23 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం లేదు. ఈ లోపే కూటమిని క్రియాశీలంగా మార్చాలని సీఎం యోచిస్తున్నారు.