ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభా నాయుడు(64) మృతి చెందారు. ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాశ విడిచారు. అయితే.. ఆమె మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. కూచిపూడి కళానృత్యంలో శోభానాయుడు అసాధారణ కళాకారిణి అని, సత్యభామ, పద్మావతి లాంటి పాత్రలను తన డ్యాన్స్ రూపంలో ఆమె అలరించినట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కాగా.. 1956 లో విశాఖ జిల్లా అనకాపల్లి లో శోభా నాయుడు జన్మించారు.
12 ఏళ్ళ వయసులోనే ఆమె కూచిపూడిలో అరంగేట్రం చేశారు. శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఈమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. చిన్నతనంలోనే ఆమె నృత్య నాటకాల్లో పాత్రలు పోషించడం మొదలుపెట్టింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె రాణించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన శోభానాయుడు తన బహుముఖ ప్రతిభకు నిదర్శనంగా పద్మశ్రీ పురస్కారం 2001 లో అందుకున్నది. శోభానాయుడు శిష్యులు పలువురు రాష్ట్ర, జాతీయ పురస్కారాలను అందుకున్నారు.