మోదీ సర్కార్ తెలంగాణ ఏర్పడిన వెంటనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం తీరును తీవ్రంగా నిరసించారు. మోదీ ప్రభుత్వ చర్యకు నిరసనగా అప్పట్లో బంద్కి పిలుపునిచ్చారు. ఆ తర్వాత బీజేపీకీ, టిఆర్ఎస్కీ మధ్య క్రమంగా సఖ్యత పెరుగుతూ వచ్చింది. నోట్ల రద్దు , జీఎస్టీ లాంటి కీలకనిర్ణయాల విషయంలో, కేసీఆర్ మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇక రాష్టపతి ఎన్నికల్లోనూ, అనేక బిల్లుల ఆమోదంలోను టీఆర్ఎస్ బీజేపీ వైపునే నిలబడింది. ఆ తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలంగాణ బిజెపి కెసీఆర్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ను ఓడించేందుకు బిజెపి ప్రయత్నించింది. దాంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా టిఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రను కొంత మేరకు నిలువరించింది.
కేంద్రంలో రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కెసీఆర్ భావిస్తున్నారు. జిఎస్టీ పన్నుల్లో వాటా ఇవ్వడంలోను, వివిధ శాఖ కింద రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంలోను మోదీ ప్రభుత్వం తెలంగాణ విఙ్ఞప్తులను పెడచెవిన పెడుతుందని కెసీఆర్ అనుకుంటున్నారు. అందుకే కేంద్రంపై యుద్దానికి సిద్దమవుతున్నారని గులాబీదళంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఓ వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీ వెళ్ళిన కెసీఆర్.. ప్రధాన మంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా.. టైమ్ దొరకలేదన్న కథనాలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా జాబితాతో.. గత అయిదేళ్ళుగా కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనాల వివరాలతో కలిసి.. టిఆర్ఎస్ ఎంపీల బృందంతోపాటు కెసీఆర్ ప్రధానిని కలిసేందుకు త్వరలోనే ఢిల్లీ వెళ్ళేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ దఫా పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగా సీఎం ఢిల్లీ వెళతారని అందుకు రంగం సిద్దమవుతోందని గులాబీ శ్రేణులు చెబుతున్నారు.