telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కవిత

ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను క‌విత క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆమెను కేసీఆర్ ఆశీర్వ‌దించారు.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో క‌విత‌ చరిత్ర సృష్టించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించారు. మొత్తం 824 ఓట్లకు గాను, 823 ఓట్లు పోలవ్వగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, 728 ఓట్లు సాధించి చరిత్ర సృష్టించారు. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ)- 56, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి( కాంగ్రెస్)-29 ఓట్లు సాధించి, డిపాజిట్ కోల్పోయారు. 10 ఓట్లను చెల్లనవిగా ప్రకటించారు ఎన్నికల సంఘం అధికారులు.

మొత్తం రెండు రౌండ్లలో కౌంటింగ్ జరగ్గా..రెండు రౌండ్లలోనూ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పూర్తి ఆధిక్యం సాధించారు. మొదటి రౌండ్ లోనే గెలుపునకు కావలసిన మెజారిటీ సాధించి, విజయ ఢంకా మోగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల్లో కల్వకుంట్ల కవిత పట్ల ఉన్న ఆదరణ ఇంతటి ఘన విజయానికి ముఖ్య కారణాలుగా నిలిచాయి. ఫలితాల అనంతరం,ఎమ్మెల్సీ గా ఓటు వేసి గెలిపించిన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఎంపీటీసిలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లకు కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలను సమన్వయం చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు, కవిత గారు ‌ధన్యవాదాలు తెలిపారు.

Related posts