భారతదేశంలో ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. కొందరు ప్రజలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఏకంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని కరూర్ జిల్లా యంత్రాంగం కూడా ఈ తరహా తరహా చర్యలకే సిద్ధమైంది. రాష్ట్రంలో ఈ ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్లో టీకా తీసుకునే వారిపై కానుకల జల్లు కురిపించనుంది.
లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్తో సహా పలు బహుమతులను అందజేయనుంది. ఈ మేరకు కరూర్ జిల్లా కలెక్టర్ టి.ప్రభు శంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా టీకా వేయించుకున్న వారి కోసం జిల్లా యంత్రాంగం లక్కీ డ్రా నిర్వహించనుంది. లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ అందజేయనున్నారు.
24 ప్రెజర్ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా టీకా కేంద్రాలకు లబ్ధిదారులను తీసుకురావడంలో స్వచ్ఛందంగా పనిచేసేవారికి రూ.5 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. 25కంటే ఎక్కువ మందిని తీసుకువచ్చే వాలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతామన్నారు. ఈ వినూత్న ప్రయత్నానికి తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు.