telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మొన్న గోవా, నిన్న కర్ణాటక, నేడు రాజస్థాన్ లో.. కాంగ్రెస్ ను పరిగెత్తిస్తున్న బీజేపీ…

మొన్న గోవా, నిన్న కర్ణాటక, నేడు రాజస్థాన్ లో.. బీజేపీ ఆకర్ష్ పథకానికి ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిస్థితులు తారుమారైపోతున్నాయి. రాజస్థాన్‌ అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌కు పునరావృతం కానున్నాయని ప్రతిపక్ష నేత గులాబ్‌చంద్‌ కటారియా (భాజపా) పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం పోరాడటం వల్లే ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అలాంటి ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై కటారియా స్పందించారు. ప్రజల కోరిక మేరకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తనను రాష్ట్ర సీఎంను చేశారని, ఎటువంటి పరిస్థితుల్లో సీఎం కుర్చీ తనదేనని గహ్లోత్‌ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారని కటారియా చెప్పారు. బడ్జెట్‌ గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో గహ్లోత్‌ ఆ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

అశోక్‌ ను సీఎం పదవి నుంచి తొలగించి దిల్లీ తీసుకెళ్తారనే భయం పట్టుకుందని, అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదని, అలాంటప్పుడు ప్రజలు ఆయనే సీఎం కావాలని కోరుకున్నారని ఎలా చెబుతారని కటారియా ప్రశ్నించారు. ఇప్పటికే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ రెండుగా విడిపోయిందన్నారు. త్వరలోనే కర్ణాటక, గోవాల్లో తరహా పరిస్థితులనే రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ ఎదుర్కొనబోతోందని కటారియా జోస్యం చెప్పారు.

Related posts