నేడు కారెం శివాజీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో మంతనాలు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కారేం శివాజీతోపాటు తొమ్మిది మందికి సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా సమాచారం. చంద్రబాబు హాయంలో కారెం శివాజీ ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన నియామకం దగ్గర నుండి న్యాయపరమైన వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒక దశలో న్యాయస్థానం ఆయన నియామకాన్ని తప్పు పట్టింది. ఆ తరువాత తిరిగి న్యాయ పరంగా పోరాటం కొనసాగిస్తూ.. ఆ పదవిలో ఆయన కొనసాగారు. ఏపీలో ప్రభుత్వం మారి.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన అదే పదవిలో కొనసాగారు. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి వేరు వేరుగా లేఖలు రాశారు.
కారెం శివాజీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసారు. ఆ తరువాత సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ నేతలతో కలిసి నడిచారు. ఆ తరువాత టీడీపీకి అనుబంధంగా వ్యవహరించారు. దీంతో..ఆయనకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కీలకమైన ఎస్సీ..ఎస్టీ కమిషన్ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. కారెం శివాజీ కోసం గోదావరి జిల్లాలకు చెందిక ఒక సీనియర్ మంత్రి ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు నిర్వహించిన ధర్మ పోరాట దీక్షల సమయంలో ఆయన వెంటే ఉన్నారు.