భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీ పాలక వర్గం వ్యవహరిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జీవో 39, తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం భూముల రక్షణ కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా మంగళవారం ధర్నాలు చేస్తామని అన్నారు.
దేవాలయ ఆస్తుల జోలికి వస్తే తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన చెప్పారు. చాలా మంది భక్తులు దేవుడిపై భక్తితో టీటీడీకి భూములు ఇచ్చారని తెలిపారు. దేవాలయాల భూములు గజం అమ్మినా తమ పార్టీ పోరాటం చేస్తుందని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. సింహాచలం భూములు కబ్జాకు ఎలా గురయ్యాయని ఆయన ప్రశ్నించారు. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.