ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటనపై బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ మండిపడ్డారు. ఓ వైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారని దుయ్యబట్టారు. అదేవిధంగా ప్రతి పక్ష నేత చంద్రబాబు హైదరాబాద్ లో ఉండటాన్ని కూడా కన్నా తప్పుపట్టారు. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు కొంప మునిగిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ కు జారుకున్నారని ఎద్దేవా చేశారు.
వరదల దాటికి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల గురించి మాత్రం అధికార, ప్రతిపక్ష నేతలు పట్టించుకోవడం లేదని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వీరిద్దరి తోక నేతలు ‘ఇల్లు మునిగిందా? లేదా?’ అని చర్చ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆ ఇంటి సంగతిని వదిలిపెట్టాలనీ, వైసీపీ, టీడీపీ కారణంగా రాష్ట్రం నిండా మునుగుతోందిని కన్నా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మేరకు కన్నా ట్వీట్ చేశారు.