కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం “మణికర్ణిక”. గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ చిత్రానికి ముందుగా క్రిష్ దర్శకత్వం వహించారు. ఆ తరువాత విభేదాలు రావడంతో క్రిష్ మధ్యలోనే వెళ్లిపోవడం… మిగిలిన బాధ్యతను కంగనా తీసుకోవడం తెలిసిందే. అయితే సినిమా విడుదల తరువాత క్రిష్ సినిమాపై, కంగనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెలిసిందే.
ఈ వివాదంపై తాజాగా కంగనా మొదటిసారిగా స్పందించారు. స్విట్జర్లాండ్ ట్రిప్ ముగించుకుని వచ్చిన కంగనా ఈ వివాదం గురించి మాట్లాడుతూ ‘‘మణికర్ణిక”కు నేనే దర్శకత్వం వహించాననే విషయంలో ఎటువంటి మార్పులేదు. క్రిష్ ఇలా నన్ను ఎటాక్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఆయన చెప్పేదే నిజమైతే నిరూపించమనండి. ఆయన మీడియాతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి లాభం లేదు. “మణికర్ణిక” విడుదలైంది. ఆ సినిమాకు నేనే దర్శకత్వం వహించాను. ఈ విషయంలో ఇక చేయడానికేం లేదు” అంటూ క్రిష్ తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ “నా పాత్రను తీసేశారు, కట్ చేశారు… అని ఆరోపణలు చేసిన వారికి నేను ఒక్కటి చెప్పాలి అనుకుంటున్నా. నేను ఓ నటిగా, ఫిల్మ్మేకర్గా మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్నా. వీటిని నేను నా సొంతంగా సాధించా… మా నాన్న నాకివ్వలేదు. మీరూ ఇలాంటి స్థాయికి రండి. అంతేకానీ మరొకర్ని చూసి ఏడిస్తే… ఫలితం ఉండదు” అంటూ వ్యాఖ్యానించింది.
ఇక సినిమా ఎడిటింగ్ సమయంలో కంగనా చాలా మూర్ఖంగా ప్రవర్తించిందని, సినిమా అప్డేట్స్ తనకు చెప్పలేదని క్రిష్ చేసిన వ్యాఖ్యలపై చిత్ర నిర్మాత కమల్ జైన్ స్పందించారు. క్రిష్ తమ సినిమాకు నష్టం కల్గించాలనే మీడియాకు అలా చెప్పారని, సినిమాకు సంబంధించిన అన్ని నిర్ణయాల్ని ఆయనకు చెప్పే తీసుకున్నామని స్పష్టం చేశారు.