బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ఫుత్ గత నెల 14న ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో ఆయనను హత్య చేశారని ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మృతి కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హీరోయిన్ కంగన రనౌత్ సైతం సుశాంత్ ఆత్మహత్య కు బాలీవుడ్ లో ఉన్న నెపోటిజమే అని అన్నారు. అంతేకాకుండా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, అందుకోసం ఎంత దూరమైన వెళ్తానని కంగనా స్పష్టం చేశారు. సుశాంత్ ఆత్మహత్య తరవాత కంగన విడుదల చేసిన వీడియోలో ఆదిత్య చోప్రా తన స్నేహితుడైన కరణ్ జోహార్తో కలిసి, కావాలనే సుశాంత్ కెరీర్ను నాశనం చేసాడని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కంగనను ప్రశ్నించడానికి ముంబై పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆమె లాయర్ వెల్లడించారు. అయితే మార్చి 17 నుంచి కంగనా మనాలీలో ఉన్నారని, ఓ బృందాన్ని అక్కడకు పంపి ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేయాల్సిందిగా పోలీసులను కోరినట్లు కంగనా లాయర్ తెలిపారు.
previous post