కమ్మ అంటే అమ్మలా ఆదరించే జీవన విధానమని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ హెచ్ ఐసీసీలో శనివారం ప్రారంభమైన కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కె.జి.ఎఫ్) రెండు రోజుల సదస్సు తొలిరోజు కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కమ్మ కుటుంబ సభ్యులను ఒక్క దగ్గర చేర్చడంలో కేజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ కృషి అభినందనీయమని ప్రశంసించారు.
2023 కి ముందే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పానని, అయితే ఎన్నికలు ఇతర పరిస్థితుల వల్ల సాధ్యం కాలేదని, ఇప్పుడు కుసుమ కుమార్ ఆధ్వర్యంలో 90 రోజుల్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకుని కార్యక్రమం ఘనంగా నిర్వహించారని సీఎం కితాబు ఇచ్చారు.
కమ్మ అంటే అమ్మలాంటి వారని, అమ్మ బిడ్డ కడుపు చూస్తుందని, కమ్మవారు వ్యవసాయం చేసి పదిమందినీ ఆదరిస్తూ తాము ఎదుగుతూ తోటివారికి సాయపడుతున్నారని అన్నారు.
ఓ సినిమాలో పేర్కొన్న విధంగా కొండమీద అమ్మవారు కొండకింద కమ్మవారు అన్నట్లు సారవంతమైన నేల, నీరు ఉన్న అన్ని చోట్లా కమ్మవారు విస్తరించారని సీఎం అన్నారు.
కష్టపడి పంటలు పండించాలి, పది మందికి ఉపయోగపడాలి అనుకుంటారని, కమ్మవారితో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని సీఎం చెప్పారు.
ఎన్టీఆర్ భవన్ లైబ్రరీలో నేర్చుకున్న పాఠాలే తనను ఈ ఉన్నత స్థాయికి దోహదం చేశాయని సీఎం చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు రాజకీయాలు ఎందరికో అవకాశాలు కల్పించాయన్నారు.
ఎన్జీ రంగా, పీవీ, వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి వంటి నేతల వల్ల ఢిల్లీలో బలమైన తెలుగు నాయకత్వం ఉండేదని, ప్రస్తుతం అలాంటి నాయకత్వానికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన ఆవశ్యకతను సీఎం తెలియజెప్పారు.
ఎన్టీఆర్, చంద్రబాబు సంకీర్ణ రాజకీయాలు కేంద్రంలో ఎందరికో కీలక అవకాశాలు ఇచ్చాయన్నారు.
అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదని, పాలిటిక్స్, లీడర్షిప్ లో ఎన్టీఆర్ ఓ బ్రాండ్ అని సీఎం చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి నాయకులు ఉన్నారంటే ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాలేనని అన్నారు.
ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే ఈ నాడు దేశాన్ని ఏలుతున్నాయన్నారు.
వ్యవసాయంతోపాటు అన్ని రంగాల్లో కమ్మవారి కృషిని ఎవరు కాదనలేరన్నారు.
అమెరికాలో తానాలో, సిలికాన్ వ్యాలీ ఐటీలో కీలకమైన కమ్మవారు హైదరాబాద్ ని విశ్వ నగరంగా మార్చే ప్రణాళికలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
మీలో ఉన్న ప్రతిభని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి ప్రభుత్వం సిద్ధం గా ఉందన్నారు. కమ్మవారు పెట్టుబడులు పెట్టాలన్నారు,
తమ కులాన్ని అభిమానిస్తాం.. ఇతర కులాలను గౌరవిస్తాం అనే విజ్ఞత విధానం పాటిస్తామని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోమీ కృషికి గుర్తింపు ఉంటుందన్నారు.
పన్నులు కట్టే ప్రాంతంలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంటుందని,
నిరసన తెలిపే అవకాశం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యతని,
నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారి పతనానికి అది దారితీసిందని అన్నారు.
నిరసనను అణచివేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో డిసెంబర్ 3 న చూశామన్నారు.
పార్టీ వేరైనా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కావాలని ఆకాంక్షించామని, ఢిల్లీ లో ఇప్పుడు నాయకత్వ లోపం కనిపిస్తుందన్నారు.
తమ ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుందని, కమ్మ సంఘం కి కేటాయించిన 5 ఎకరాల భూమికి సంబంధించి సమస్య పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. భూమికి సంబంధించిన సమస్య పరిష్కారానికి రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి, భవన నిర్మాణ సహకారానికి ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడకు వచ్చారని అన్నారు.
ఎమ్మెల్యే గాంధీ, సీవీ రావు ఈ విషయంలో చేసే ప్రయత్నాలకు సహకరిస్తామన్నారు. కేజీఎఫ్ తొలిరోజు సదస్సలో కేజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ ప్రారంభోపన్యాసంలో అమెరికా, కెనడా, ఆస్ర్టేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశవిదేశాల నుంచి వచ్చిన రెండు వేల మంది కమ్మ సోదరులకు సాదరంగా స్వాగతం పలికారు.
సీఎం రేవంత్ రెడ్డి తనకు ఏవీ కాలేజ్ మేట్ అని, ఇప్పుడు రాజకీయ సహచరుడని తమ సాన్నిహిత్యాన్ని వివరించారు. ప్రపంచం ఒక కుగ్రామంగా మారిన నేటి కాలంలో కమ్మ వారంతా కేజీఎఫ్ వేదికలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను వివరించారు.
బంగారం వంటి పంటలు పండించే కమ్మవారు తాము ఎదుగుతూ తోటి వారికి సాయపడే మన పూర్వీకుల వారసత్వాన్ని సుసంపన్నం చేయాలన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే కౌతవరం తొలి కమ్మ సదస్సులోనే అవకాశాలు అందిపుచ్చుకునేందుకు విద్య ఆవశ్యకతను గుర్తించి తీర్మానించారన్నారు.
అదే స్ఫూర్తితో నేడు విద్యాలయాలు హాస్టళ్లు నెలకొల్పి పేద విద్యార్ధులకు సహాయ పడుతున్నారన్నారు. కష్టించే తత్వం కమ్మ వారి సొంతమని, ఐక్యతతో మరింతగా ఎదగాలని, తోటి వారికి సాయపడాలని కుసుమ కుమార్ పిలుపు ఇచ్చారు.
కమ్మవారి దాతృత్వానికి నాగార్జున సాగర్ నిదర్శనమన్నారు. మక్త్యాల రాజా అప్పట్లో 50 లక్షల ధన సహాయం, 5 వేల ఎకరాల దానం అభినందనీయమన్నారు. ఐక్యత, సుసంపన్నం కావడం, తోటి పేదలకు సహాయపడటం, ప్రపంచ వ్యాప్తంగా కమ్మ వారికి సహాయ సహకారాలు అందించడం కేజీఎఫ్ ప్రధాన లక్ష్యమన్నారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ తొలి సదస్సు తొలిరేజు శనివారం ఘనంగా జరిగింది. సదస్సు ప్రారంభ హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్.ఐ.సి.సి.)లో జూలై 20 శనివారం తొలి కమ్మ గ్లోబల్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
సదస్సుకు దేశ, విదేశాల్లోని కమ్మ సోదరులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన, గణేష్ వందనం, గోదాదేవి కల్యాణం, కేజిఎఫ్ గీతం ఆవిష్కరణ కార్యక్రమం అలరించాయి.
సాయంత్రం వైద్యరంగం అంశంపై చర్చ జరిగింది. తర్వాత తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కమ్మ పారిశ్రామికవేత్తలతో సమావేశమై పెట్టుబడుల అవకాశాలు, వ్యాపార విస్తరణ అంశాలపై చర్చించారు.
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సదస్సులో తమిళనాడు ఎంపీ కళానిధి వీరస్వామి, మాజీ గవర్నర్ రామమోహనరావు, కర్నాటక ఎమ్మెల్యే మునిస్వామి, కేపీసీసీ రాజగోపాల్ నాయుడు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, యరపతినేని శ్రీనివాసరావు, దగ్గుపాటి వెంకటేశ్వరర్రసాద్, రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ మంత్రులు కట్టా సుబ్రమణ్యం నాయుడు, వసంత నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వర్ రావు, మురళీ మోహన్, సత్యవాణి, తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్, మాజీ అధ్యక్షులు జై తాళ్లూరి, సతీష్ వేమన, కోమటి జయరాం, రైతు నేస్తం వెంకటేశ్వరరావు, పుల్లెల గోపీచంద్, ఎమ్మెస్కే ప్రసాద్, సీవీ రావు, రాజశేఖర్, జీవిత, తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు ఆదివారం కేజీఎఫ్ సదస్సులో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొంటారు. వివిధ అంశాలపై చర్చ జరుగుతుంది.