కమల్ హాసన్, శంకర్ల క్రేజీ కాంబినేషన్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో తెరకెక్కుతున్న చిత్రం “భారతీయుడు-2”. 1996లో వచ్చి సంచలనం రేపిన “భారతీయుడు” చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఎన్నో ఏళ్ల చర్చల తర్వాత సినిమాను మొదలుపెడితే… కమల్కు మేకప్ పడక ఒకసారి.. నిర్మాతలు, డైరెక్టర్ మధ్య విభేదాల వల్ల మరోసారి.. కమల్ పొలిటికల్ కమిట్మెంట్ల వల్ల మరోసారి.. సెట్లో జరిగిన క్రేన్ ప్రమాదం వల్ల ఇంకోసారి షూటింగుకి బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా సంక్షోభం ఎలానూ ఉండనే ఉంది. ఈ చిత్రం చాలావరకు షూటింగ్ లాక్ డౌన్ కు ముందు జరిగింది. ఇక ఇప్పుడు మళ్లీ తదుపరి షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, తన షూటింగ్ భాగాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వచ్చే జనవరిలోగా పూర్తి చేసేయాలని కమల్ దర్శకుడు శంకర్ కి తాజాగా సూచించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే, ఆమధ్య కమల్ రాజకీయపార్టీని నెలకొల్పి రాజకీయాలలో సైతం బిజీ అయ్యారు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో తాను పాల్గొనవలసి వున్నందున కమల్ ఈ చిత్రాన్ని ముందుగానే పూర్తిచేసుకుని, ఇక రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.
previous post