కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ చక్రవర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంకురా ప్రాంతంలో ఓ నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ను విషనాగుగా ఆయన అభివర్ణించారు. ఓ విష సర్పం మనుషులను ఎలా చంపుతుందో, నిర్మలా కూడా అలాగే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శించారు. అస్తవ్యస్త ఆర్థిక విధానాలతో ప్రజలు చచ్చిపోతున్నారని అన్నారు. ఆర్థికమంత్రి పదవికి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పెరుగుతున్న చమురు ధరలు, రైళ్ల ప్రైవేటీకరణ ప్రతిపాదనల నేపథ్యంలో నిర్మలా విధానాలను ప్రశ్నించారు. ప్రపంచంలో ఇంతకంటే చెత్త ఆర్థికమంత్రి ఇంకెవరూ ఉండరని ఎద్దేవా చేశారు. కల్యాణ్ చక్రవర్తి వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు వెంటనే స్పందించాయి. మమతా బెనర్జీ తన పార్టీ నేతలపై అదుపు కోల్పోయారని, అసహనం పెరిగిపోవడంతో తృణమూల్ నేతలు అర్థంపర్థంలేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.