ఇళ్ల స్థలాల పేరిట వైసీపీ కార్యకర్తలు వసూళ్లకు పాల్పడుతున్నారని ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 23 వేల ఎకరాల్లో అధికభాగం వైసీపీ నేతలవేనని అన్నారు. దుర్మార్గంగా సేకరించిన భూముల స్వీకరణకు ప్రజలు సిద్ధంగా లేరని కళా వెంకట్రావు మండిపడ్డారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న భూ కుంభకోణానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో జరుగుతున్న భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని సూట్కేసు కంపెనీ కుంభకోణంగా మార్చారని అన్నారు. భూకుంభకోణంపై రిటైర్డ్ లేదంటే సిట్టింగ్ జడ్జితో కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.