తూర్పుగోదావరి జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ప్రతిభకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. తాము కార్పోరేట్ స్కూల్స్కి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు.
ఏకంగా సీఎం వైఎస్ జగన్ ముందు అమెరికాన్ ఇంగ్లీష్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడి అదరగొట్టారు. ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు పిల్లలు ఆంగ్లంలో సమాధానమిచ్చారు. విద్యార్థుల ఇంగ్లీష్ ప్రావిణ్యం చూసి సీఎం జగన్ ఫిధా అయిపోయారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సరిగా చెప్పరని, నాణ్యమైన విద్య ఉండదని, టీచర్లు సరిగా రారని, ఇంగ్లీష్లో వెనుకబడిపోతారని, క్లాసులు సరిగా నిర్వహించరనే వాదనలు వినిపిస్తాయి. అయితే, ఆ అభిప్రాయాల్లో నిజం లేదని, అవి కేవలం అపోహలు మాత్రమే అని గవర్నమెంట్ స్కూల్ పిల్లలు నిరూపిస్తున్నారు.
సీఎం జగన్ గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి ప్రభుత్వ హైస్కూల్ విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారు జగన్ ముందు కూర్చుని ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు ఎదురుగా ఉన్నా విద్యార్థులు మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడారు.
అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, నాడు-నేడు పథకాల విశిష్టతను పిల్లలు ఇంగ్లీష్లో జగన్కు చక్కగా వివరించారు. ఇలాంటి కార్యక్రమాలతో, పథకాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారంటూ సీఎం జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు.
అనుదీప్ అనే 7వ తరగతి విద్యార్థి మాత్రం సీఎం జగన్ ఆకట్టుకున్నాడు. ఇంగ్లీష్ లో అదరగొడుతూనే తాను పెద్దయ్యాక ఐఏఎస్ అవుతానని.. అప్పుడు మీ పీఏగా అవకాశం ఇస్తే.. మీపై వచ్చే విమర్శలను తిప్పికొడాతనని ప్రామిస్ చేస్తున్నాని.. మీరు కూడా ప్రామిస్ చేయాలని కోరాడు. దీంతో సీఎంతో సహా అక్కడున్నవారంతూ నవ్వుకున్నారు.
అలాగే రేష్మా అనే పదో తరగతి విద్యార్థిని మాట్లాడిన తీరుకు సీఎం జగన్ మురిసిపోయారు. హామీలన్నింటిని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి మీరని(సీఎం జగన్ను ఉద్దేశించి.. ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడవచ్చని చెప్పింది రేష్మా.
ఇక మేఘన అనే విద్యార్థి మాట్లాడుతూ.. అమ్మ ఒడి పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. సగటు విద్యార్థిగా ఉన్న తనను.. మంచి వక్తంగా, అదీ ఇంగ్లీష్ ద్వారా రాటుదేల్చారని సంతోషం వ్యక్తం చేసింది మేఘన.
ఇంగ్లీష్ మాట్లాడటంలో మంచి ప్రతిభను చూపుతున్న బెండపూడి విద్యార్థులను అభినందించిన సీఎం జగన్.. ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనసారా ఆశీర్వదించారు.