గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త యావత్ భారతీయ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కాగా తన సోదరుడు బాలు మరణాన్ని తట్టుకోలేకపోయారు కళాతపస్వి కె. విశ్వనాథ్. బాలు తనకు సోదరుడే కాదు ఆరో ప్రాణం అని, ఇంత తొందరగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడని అనుకోలేదంటూ ఆవేదన చెందారు. బాలు విషయంలో దేవుడు తనకు తీరని అన్యాయం చేస్తాడని అనుకోలేదంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేనని చెప్పిన విశ్వనాథ్.. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులంతా దైర్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కరోనాతో పోరాడి గెలిచిన ఆయన చివరకు అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు, తమిళ సినీ ప్రపంచం కన్నీరు పెట్టుకుంటోంది. దిగ్గజ గాయకుడి అస్తమయం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మీడియా ఛానల్స్ అన్నింటా బాలు గొప్పతనం, విజయాలు వివరిస్తూ ఆయన గానామృతాన్ని వినిపిస్తున్నారు. ఇండస్ట్రీలోని నటీనటులు, గాయకులు, దర్శకనిర్మాతలు అంతా ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు (శనివారం) ఉదయం 11 గంటలకు ఆయన అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
previous post
కేవలం సోషల్ మీడియాలోనే దీని గురించి చర్చ… పిల్లలపై అనుష్క రియాక్షన్