సుప్రీంకోర్టు 47వ చీఫ్ జస్టిస్ గా శరద్ అర్వింద్ బాబ్డే నేను ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జస్టిస్ బాబ్డే చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రంజన్ గొగోయ్ నిన్న పదవీ విరమణ చేశారు. చీఫ్ జస్టిస్ గా బాబ్డే 13 నెలల పాటు బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, జస్టిస్ ఎన్వీ రమణ, మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జస్టిస్ ఎస్ఏ బొబ్డేకు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతితో పాటు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
1956లో మహారాష్ట్రలోని నాగపూర్ లో జన్మించిన బాబ్డే… నాగపూర్ యూనివర్శిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ డిగ్రీలను సాధించారు. 1978లో మహారాష్ట్ర బార్ కౌన్సిల్ లో తన పేరును నమోదు చేయించుకున్నారు. సుప్రీంకోర్టులో అడుగుపెట్టక ముందు న్యాయవాదిగా, వివిధ కోర్టుల్లో జడ్జిగా ఆయన 21 ఏళ్ల పాటు పని చేశారు. 2000 మార్చ్ 29న బాంబే హైకోర్టు జడ్జిగా బాధ్యతలను జస్టిస్ బాబ్డే స్వీకరించారు. 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 2021 ఏప్రిల్ 23న చీఫ్ జస్టిస్ బాబ్డే పదవీ విరమణ చేయనున్నారు.