జంక్ ఫుడ్ .. అంటే, పిజ్జాలు, బర్గర్లు, చక్కెర అధికంగా ఉండే కుకీస్, స్వీట్లు లను చూడగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ ఆహార పదార్థాలను ఎవరైనా ఇష్టంగానే తింటారు. కానీ వాటిని తింటే అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మరి వాటిని తినడం ఎలా ? అంటే.. అందుకు ఓ ఉపాయం ఉంది అంటున్నారు వైజ్ఞానికులు. అదేమంటే, అందులో ఏవి తినాలి అని మీకు అనిపిస్తుందో, వాటి వాసన పీల్చుకోండి. అవును… 2 నిమిషాల పాటు అలా ఆ ఆహార పదార్థాల వాసన చూస్తే చాలు మీకు వాటిని తిని కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది మేం చెబుతున్నది కాదు, సైంటిస్టుల పరిశోధనలో తేలింది. అంటే జంక్ ఫుడ్ తింటే లావు అవుతారు; వాసన చూస్తే, ఆరోగ్యంగా ఉంటారు అన్నమాటేగా.
ఇటీవల, జర్నల్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. సైంటిస్టులు కొందరికి 30 సెకండ్ల పాటు పలు కుకీల వాసన చూపించారు. దీనితో వారికి ఆ కుకీలను తినాలనే ఆసక్తి కలిగింది. తరువాత వారికి 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పాటు పిజ్జాలు, స్ట్రాబెర్రీల వాసన చూపించారు. దీనితో వారికి పిజ్జాల మీద ఆసక్తిపోయి, కడుపు నిండిన భావన కలిగింది. అనంతరం వారు స్ట్రాబెర్రీలను తినేందుకు ఆసక్తి చూపించారట. అలాగే పిజ్జాలు, యాపిల్స్తో మరోసారి టెస్ట్ చేయగా, 2 నిమిషాల అనంతరం వారికి కూడా కడుపు నిండిన భావన కలగడంతో పాటు వారు కూడా పిజ్జాలకు బదులుగా యాపిల్స్ను తినేందుకు ఆసక్తి చూపించారట.
దీని వల్ల సైంటిస్టులు చెబుతున్నదేమిటంటే.. అధికంగా క్యాలరీలు ఉన్న ఆహారాలను తినాలనే యావ కలిగితే, వాటిని తినడం కొంత సేపు ఆపాలని, వాటి వాసన 2 నిమిషాల పాటు చూస్తే ఇక ఆ ఆహారాలను తినాలనే ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుందని, తద్వారా శరీరంలో అదనపు క్యాలరీలు చేరకుండా చూసుకోవడంతో పాటు అధిక బరువు, డయాబెటిస్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఇంతకంటే బరువు తగ్గడానికి సులభమైన మార్గం ఉంటుందా.. ఇంకెందుకు ఆలస్యం, ప్రయత్నిస్తే పోయేదేముంది.. స్థూలకాయ సమస్య తప్ప; వచ్చేది మాత్రం ఆరోగ్యం, ఇది చాలా ముఖ్యం.