ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారని నందమూరి కుటుంబానికి చెందిన పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు.
మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వసాధారణం. ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యలపై చర్చ జరగాలి కానీ.. దూషణలు సరికాదని జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన తన మనసు కలిచి వేసిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనబెట్టి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నామో.. ముఖ్యంగా ఆడపడుచుల గురించి పురుషపదజాలంతో మాట్లాడుతున్నామో.. అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
స్త్రీ జాతిని, ఆడవాళ్లను గౌరవించడం మన సంస్కృతి అని చెప్పారు. ఇది మన రక్తంలో ఇమిడిపోయిన ఒక సంప్రదాయం అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. మన సంప్రదాయాన్ని రాబోయే తరాలకు భద్రంగా అప్పగించాలే కానీ ..మన సంస్కృతిని కాల్చేయడం అది చాలా తప్పు అని అన్నారు.
తాను ఒక కుటుంబసభ్యుడిగా మాట్లాడటం లేదని, ఒక కొడుకుగా, తండ్రిగా, భర్తగా, దేశ పౌరుడిగా ముఖ్యంగా సాటి తెలుగువాడిలా మాట్లాడుతున్నానని తెలిపారు. రాజకీయ నాయకులందరికీ నాది ఒకటే విన్నపం.. దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఆపి, ప్రజల సమస్యలపై పోరాడాలన్నారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడాలని సూచించారు..ఇది నా విన్నపం మాత్రమే అని ,ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుకుంటున్నా” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
— Jr NTR (@tarak9999) November 20, 2021