2024 ఎన్నికల్లో వైసీపీ ప్రజాగ్రహాన్ని చవిచూస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఢిల్లీలో జీవీఎల్ నరసింహారావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని మార్చడానికి ముఖ్యమంత్రి జగన్ చెబుతున్న కారణాలకు, చేతలకు పొంతన లేదని చెప్పారు.
అమరావతి రైతులకు, రైతు కూలీలకు మీరు ఇవ్వాలనుకుంటున్న ప్యాకేజీ ఖర్చుతో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయవచ్చని కన్నా తెలిపారు. అమరావతిలో మరో భూదందాకు మీరు తెరలేపబోతున్నారనే కారణమే తనకు కనిపిస్తోందని చెప్పారు. అమరావతిపై మీరు చెబుతున్న కారణాలు, కబుర్లు నమ్మదగినవి కాదని అన్నారు. అసెంబ్లీని ఇక్కడ ఉంచి సెక్రటేరియట్ ను విశాఖలో పెడతామని చెప్పడం పిచ్చి తుగ్లక్ ను మరిపిస్తోందని ఎద్దేవా చేశారు.