హాలీవుడ్ మాజీ జంట జానీ డెప్-అంబర్ హర్డ్ పరువు నష్టం దావా వ్యవహారంలో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. జానీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పాటు అంబర్ హర్డ్కు జరిమానా విధించింది కోర్టు.
6 వారాలపాటు ఈ కేసు విచారణలో పైగా అంబర్ హెర్డ్ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చేసింది కోర్టు. జానీ పరువుకు భంగం కలిగించినందుకుగానూ హెర్డ్ ఆయనకు 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. అదే సమయంలో హెర్డ్కు కూడా నటుడు 2 మిలియన్ డాలర్లు చెల్లించాలని తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జానీ డెప్.. నటి అంబర్ హెర్డ్ ప్రేమించుకున్నారు. 2015లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.అయితే ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. మనస్పర్థల కారణంగా ఏడాదికే దూరమైన వీరు.. 2017లో విడాకులు తీసుకున్నారు.
2018లో అంబర్ హెర్డ్ వాషింగ్టన్ పోస్ట్కు ఆర్టికల్ ఒకటి రాసింది. ఓ సెలబ్రిటీ అయిన తనకు కూడా గృహ హింస తప్పలేదని ఆర్టికల్లో పేర్కొంది. అందులో ఎక్కడా జానీ డెప్ పేరును ప్రస్తావించనప్పటికీ.. గృహ హింసలో అతడి పేరు మార్మోగింది.
దీంతో జానీ కోర్టుకెక్కారు. హెర్డ్ రాసిన ఆర్టికల్ కారణంగా తన కెరీర్ దెబ్బతిందని ఆరోపిస్తూ 50 మిలియన్ డాలర్లకు పరువు నష్టం దావా వేశాడు. దీంతో హెర్డ్ కూడా అతడిపై 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది.
జానీ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని హెర్డ్ ఆరోపించింది. తనకు అయిన గాయాల ఫొటోలను కూడా చూపించింది. అయితే, ఈ ఆరోపణలను జానీ బలంగా ఖండించాడు. హెర్డ్ ఎప్పుడూ తనతో హింసాత్మకంగా వ్యవహరించేదని ఆరోపించాడు.
అంతేకాదు తనకు నరకం చూపించేదని, అవమానించేదని ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్తో అంబర్హెర్డ్ తో ఎఫైర్ నడిపించిందని ఆరోపించాడు.
కాగా..2018లో ఆమె రాసిన సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ ఒకటి.. జానీ పరువుకు భంగం కలిగించేంది ఉందని, దాని ఆధారంగానే ఆమె ఆయనపై వేధింపులకు, పరువుకు భంగం కలిగించిందని అంచనాకి వచ్చామని కోర్టు పేర్కొంది.
ఈ కేసులో కోర్టు దాదాపు ఆరు వారాలకు పైగా సుదీర్ఘంగా విచారణ జరిపింది. దీనిపై బుధవారం తుది తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు నేపథ్యంలో హెర్డ్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం ట్విటర్ వేదికగా స్పందించింది”ఈ రోజు నేను అనుభవించే బాధ మాటల్లో చెప్పలేను. నా మాజీ భర్త పరపతి ముందు కొండంత సాక్ష్యం కూడా సరిపోలేదని తెలిసి నా గుండె పగిలింది.”
ఇది నా ఒక్కదాని ఓటమి కాదు.. మహిళలందరి ఓటమి. మహిళల పట్ల జరిగే హింసను తీవ్రంగా పరిగణించాల్సింది పోయి.. ఆ వేధింపులపై గళమెత్తినందుకు నన్ను అవమానించారు. ఈ రోజు నేను ఈ కేసు ఓడిపోయిన దాని కంటే.. మాట్లాడే హక్కును, స్వేచ్ఛను కోల్పోయినందుకే ఎక్కువ బాధగా ఉంది” అని హెర్డ్ రాసుకొచ్చింది.
అలాగే కోర్టు తీర్పు పట్ల ‘జాక్ స్పారో’ జానీ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు అనుకూలంగా రావడంతో.. జానీ డెప్ సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చారంటూ జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడాయన.