ప్రపంచ కప్లో టీమిండియా సెమీఫైనల్లో న్యూజిలాండ్తో చేతిలో ఓడిన విషయం తెలిసిందే. వరల్డ్కప్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు విశ్వవిజేతగా నిలిచే అవకాశాలు మెరుగ్గా ఉండటంతో మెగా టోర్నీకి కొన్నినెలల ముందే భారత అభిమానులు లీగ్తో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్ల టికెట్లను భారీ సంఖ్యలో కొనుగోలు చేశారు. సెమీస్ వరకు భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ స్టేడియంలో ఇండియన్ ఫ్యాన్స్దే హవా. సెమీస్ ఓటమితో టోర్నీ నుంచి కోహ్లీసేన నిష్క్రమించడంతో భారత అభిమానులు కొనుగోలు చేసిన టికెట్లను ఆసక్తిగల వారికి విక్రయించాలని న్యూజిలాండ్ ఆటగాడు కోరడం విశేషం.
ఈ నేపథ్యంలో కివీస్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ ట్విటర్లో స్పందిస్తూ.. ‘ప్రియమైన భారత అభిమానులు. ఒకవేళ మీరు ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు స్టేడియానికి రాలేకపోతే దయచేసి మీరు కొనుగోలు చేసిన మ్యాచ్ టికెట్లను అధికారిక ప్లాట్ఫామ్ల ద్వారా విక్రయించండి. అధిక ధరకు అమ్ముకోవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ ధనవంతులు మాత్రమే కాకుండా నిజమైన క్రికెట్ అభిమానులు మ్యాచ్కు వచ్చేలా చేయండి’ అని నీషమ్ ట్వీట్ చేశాడు.