తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బురద చల్లేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఉండవల్లిలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్న అనంతరం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ లాంటి 10 మంది వ్యక్తులు కలిసి వచ్చినా ఏపీలో టీడీపీని ఏమీ చేయలేరని జేసీ అన్నారు. టీఆరెస్, వైసీపీలు దాదాపు ఏడాది క్రితం నుంచి కలిసి పనిచేస్తున్నాయనీ, కొత్తగా ఇప్పుడేం కలవలేదని స్పష్టం చేశారు.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని జేసీ తెలిపారు. ఒక్కోసారి ఒక్కొక్కరికి కోపం వస్తుందనీ, ఇప్పుడు కేసీఆర్ కు వచ్చిందని ఆయన అన్నారు. జగన్ సోదరి షర్మిలను తాను వ్యక్తిగతంగా విమర్శించలేదని జేసీ పునరుద్ఘాటించారు.రాబోయే ఎన్నికల్లో టికెట్లపై చంద్రబాబుతో చర్చించలేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలోని సమస్యలపై చర్చించేందుకే సీఎంతో భేటీ అయ్యామని పేర్కొన్నారు.
చంద్రబాబును చూసి ఎవరు ఓటెయ్యరు: ఎంపీ జేసీ