కోస్టల్ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం (55) హత్య మిస్టరీ వీడింది. నాలుగురోజుల క్రితం జరిగిన ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి పక్కన కారులో జయరాం మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాకేష్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.4.5 కోట్ల వ్యవహారంలో జయరాంను రాకేష్ హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు.
జయరాం, రాకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలోనే ఈ హత్య జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. హత్యను ప్రమాదంగా చిత్రీకరిచేందుకు రాకేష్ యత్నించాడని తెలిపారు. రాకేష్కు సహకరించిందెవరో తేలాల్సి ఉందని అన్నారు. ఈకేసులో జయరాం మేనకోడలు శిఖా చౌదరి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నేడు జయరాం అంత్యక్రియలు..
చిగురుపాటి జయరాం భార్యాపిల్లలు ఆమెరికా నుంచి భారత్కు చేరుకున్నారు. జయరాం మృతదేహాన్ని జూబ్లిహిల్స్లోని ఆయన నివాసానికి తరలించారు. జయరాం ఇంటికి చేరుకున్న నందిగామ పోలీసులు ఆయన భార్య స్టేట్మెంట్ తీసుకున్నారు. హైదరాబాద్లోని మహాప్రస్థానంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.