గుంటూరు జిల్లాలో ఓ గిరిజన మహిళను వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆ ఘటన గురించి తెలుసుకుంటే తన హృదయం ద్రవించిపోయిందని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలో శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్రుబాయిని ఓ వడ్డీ వ్యాపారి ట్రాక్టర్ తో తొక్కించి చంపడం తీవ్ర కలకలం రేపింది. దీనిపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలపై ప్రచారం తప్ప మహిళల మానప్రాణాలకు రక్షణ ఏది అంటూ ప్రశ్నించారు.
గిరిజన మహిళలపై దాష్టీకాలకు పాల్పడుతున్నా చర్యలు తీసుకోవడంలేదని అన్నారు. కేసులు నమోదు చేసుకునేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. అటవీ భూమిని సాగు చేసుకుంటున్న ఆ గిరిజన కుటుంబంపై ఘాతుకానికి పాల్పడ్డ ఆ వడ్డీ వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.