దేశవ్యాప్తంగా నదులను సంవరక్షించాలని అందుకు గంగానదితో శ్రీకారం చుట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హరిద్వార్లో పర్యటిస్తున్న ఆయన గంగా కాలుష్యంపై జరిగిన మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారుల సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత గంగానది ప్రక్షాళన కోసం ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన జీడీ ఆగర్వాల్ ప్రథమ వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం గంగా ప్రక్షాళన చేస్తుందని ఆశించానని, అయితే వాళ్లు ఆ విధంగా పని చేయలేకపోయారని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నదులన్నీ కలుషితమవుతున్నాయని, వాటిని సంవరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏ అభివృద్ధి అయినా పర్యావరణ సమతుల్యతపై ఆధారపడే జరగాలని, ప్రాథమిక దశలోనే పర్యావరణ సమతూల్యత కోసం కట్టుబడి ఉండాలన్నారు. ఏపీలోని విశాఖ నగరానికి వచ్చే పదేళ్లలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చబోతోందనిఆందోళన వ్యక్తం చేశారు.