అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని మల్లాపల్లి గ్రామవాసి, జనసేన కార్యకర్త మేకల ఈశ్వరయ్యపై దాడి వైసీపీ వర్గానికి చెందినవారు దాడి చేయడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో తమ జెండా తప్ప జనసేన జెండా కనిపించకూడదు అనే నియంతృత్వ, ఫ్యాక్షన్ పోకడలతో చేసిన దాడి ఇది అని పవన్ అన్నారు. జనసేన కార్యక్రమాలు చేయకూడదు, జెండా కట్టకూడదు అని పుట్టపర్తి ఎమ్మెల్యే అనుచరులు హుకుం జారీ చేశారని మండిపడ్డారు.
పార్టీపై అభిమానంతో ముందుకు వెళ్లిన ఈశ్వరయ్యను లక్ష్యంగా చేసుకున్నారని, అదే విధంగా గ్రామంలో బోరు వేసే విషయాన్ని సాకుగా తీసుకుని జనసేన కార్యకర్తపై దాడికి తెగబడ్డారని పవన్ అన్నారు. ఈ ఘటనకు కారకులైన అధికార పక్షం వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీసు యంత్రాంగంపై ఉందని పవన్ అన్నారు. కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరయ్యకు పార్టీ అండగా ఉంటుందని, జనసేన కార్యకర్తలపై దాడులకు తెగబడి, తప్పుడు కేసులు నమోదు చేసి బెదిరిస్తున్న ఘటనలు అన్ని జిల్లాల్లో చోటు చేసుకొంటున్నాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.