telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ మంచి చేస్తే… పవన్ కళ్యాణ్ మెచ్చుకోమన్నారు.. : జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

janasena leader rapaka on ycp budget

జనసేన నేత, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, వైసీపీ పార్టీ తమ మేనిఫెస్టోను దైవ గ్రంథంలో పోల్చిందనీ, ఇందులో నిజంగా అన్నీ ప్రజా సంక్షేమ పథకాలే ఉన్నాయని తెలిపారు. ఏపీ ఆర్థిక బడ్జెట్ 2019-20ను చాలా పారదర్శకంగా రూపొందించారని వ్యాఖ్యానించారు. ఈరోజు అసెంబ్లీలో రాపాక మాట్లాడుతూ..‘అధ్యక్షా.. నేను జనసేన తరఫున మాట్లాడుతున్నా అధ్యక్షా. అధికార పక్షం ఏదైనా మాట్లాడితే వెంటనే వ్యతిరేకించు అని మా అధినేత పవన్ కల్యాణ్ చెప్పలేదు అధ్యక్షా. ప్రజలకు ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుగుతుంటే సపోర్ట్ చేయమని చెప్పారే తప్ప, వాళ్లు అధికార పక్షం కాబట్టి వాళ్లు ఏం చేసినా వ్యతిరేకించమని చెప్పలేదు అధ్యక్షా.

ప్రభుత్వం ప్రజల కోసం చేసే మంచి పనులను జనసేన సమర్దిస్తుంది. ఏపీ ప్రభుత్వం అటు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చూసుకుంటూ అన్నివర్గాలకు సమదృష్టితో చూస్తూ ఈ బడ్జెట్ ను రూపొందించింది. అలాగే సుమారు రూ.28,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ తయారుచేశారు అధ్యక్షా. తండ్రి వైఎస్ తరహాలో ఆయన కుమారుడు, సీఎం జగన్ రైతులను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ రూపొందించారు. అప్పటి వైఎస్ ప్రభుత్వం వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చింది’ అని ప్రశంసలు కురిపించారు.

కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో రైతులకు పెద్దపీట వేశారని కొనియాడారు. బాధిత రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు పరిహారం ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారని, అలాంటి బడ్జెట్ నే జగన్ రూపొందించారని ప్రశంసించారు. ఈ బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఇది యాభై రోజుల్లో తయారు చేసిన బడ్జెట్ కాదని జగన్ తన పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి ఈ బడ్జెట్ ను రూపొందించారని అన్నారు.

Related posts