ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశంపై జనసేన అగ్రనేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని అన్నారు. సచివాలయ సిబ్బంది కోసం అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని, అంతకుమించి అక్కడేమీ జరగదని అన్నారు. ప్రభుత్వ ఆఫీసు ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
సచివాలయం ఏర్పాటు చేస్తే విశాఖపట్నం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్నారు. ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే, ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆఫీసు ఏర్పాటు చేస్తే ఎంతో అభివృద్ధి సాధించేవాళ్లం కదా అని ఆయన చెప్పారు. అభివృద్ధి చెందాల్సింది ప్రభుత్వం కాదని, పరిపాలన అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు.