విద్యార్థి సరిగ్గా చదవడంలేదని ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు మెడపై గొడ్డలి పెట్టి భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటన జమ్మూ-కశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ పదేళ్ల విద్యార్థిని ఒకరు చేతులతో గట్టిగా పట్టుకోగా.. టీచర్ పదునైన గొడ్డటిని మెడపై ఉంచి బెదిరిస్తున్నారు. నీ ప్రవర్తన మార్చుకోకుంటే గొడ్డలితో నరుకుతా అంటూ విద్యార్థిని బెదిరిస్తున్నాడు. బాలుడు భయంతో గట్టిగా ఏడుస్తున్నా కూడా అతన్ని వదిలిపెట్టలేదు.
తరగతి గదిలోని మిగతా విద్యార్థులను మీరు కళ్లు మూసుకోండి.. నేను వీడిని గొడ్డలితో నరికి చంపుతా అని హెచ్చరించాడు.ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్థానిక నెటిజన్లు మండిపడుతున్నారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. నిందితులను గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ట్విటర్ లో డిమాండ్ చేశారు.