తెలంగాణ పీసీసీ పదవీపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో పీసీసీ పదవీపై సోనియా గాంధీ, రాహుల్, ఇన్ చార్జ్ ఠాగూర్ కి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. పీసీసీ ఎన్నిక విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని… నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వరకు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అధిష్టానం ఎవరినైతే పీసీసీ చేయాలని అనుకుంటుందో… దానిపై సీనియర్ నాయకులతో ఏకాభిప్రాయం తీసుకోవాలని కోరారు జగ్గారెడ్డి. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఎమ్మెల్యేలుగా గెలిచే నేతలు లేరని… అందుకే బీజేపీ రాజకీయంగా ఎదిగే ప్లాన్ చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ -ఎంఐఎం పార్టీ లను ఇన్-డైరెక్ట్ గా బీజేపీ వాడుకుంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన లీడర్ షిప్ ఉన్న కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పోవాల్సిన అవసరముందన్నారు. అందుకే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పీసీసీని ప్రకటించాలన్నారు జగ్గారెడ్డి. జానారెడ్డి నాయకత్వంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టం చేశారు.
previous post
next post