కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారనీ, సమయం వచ్చినప్పుడు వారి పేర్లను బయటపెడతానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే నేతల గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీలో నేతలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసేవాళ్లు కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్ పార్టీ ఎదుగుదల కోసం పనిచేశారని జగ్గారెడ్డి ప్రశంసించారు.
పార్టీ కేడర్ లో ఉత్తమ్ మనోధైర్యం నింపగలిగారని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఉత్తమ్ పనిచేశారనడం సరికాదని వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, తెలంగాణ ఇన్ చార్జి కుంతియాలు అమ్ముడుపోయారన్నది సరికాదన్నారు. పీసీసీతో పాటు పార్టీలో సీనియర్ నేతలు సమన్వయంతో పనిచేసినప్పుడే కాంగ్రెస్ మనుగడ సాధిస్తుందని స్పష్టం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీని వీడారని తేల్చిచెప్పారు.